దర్శకరత్న దాసరి నారాయణరావు సంపూర్ణ జీవితం అనుభవించి తనువు చాలించారు. దర్శకుడిగా ఆయన అందుకున్న స్థాయి వేరెవరికీ సాధ్యం కానిది. దర్శకుడిగా.. నిర్మాతగా.. నటుడిగా.. ఇంకా పలు రకాలుగా పతాక స్థాయిని అందుకున్న ఘనత దాసరిది. ఆయన ఎవరితో అనుకుంటే వాళ్లతో పని చేశాడు. ఏదనుకుంటే ఆ సినిమా తీశాడు. కానీ చివరి సంవత్సరాల్లో ఆయన కలలు కన్న కొన్ని ప్రాజెక్టులు మాత్రం కార్యరూపం దాల్చలేదు. అవి నెరవేరకుండానే ఆయన కాలం చేశారు.
చివరి ఏళ్లలో దాసరి ఎక్కువ కలగన్నది పవన్ కళ్యాణ్ తో సినిమా గురించే. ఈ ప్రాజెక్టు గురించే రెండేళ్ల కిందటే ఘనంగా ప్రకటన చేశారు. ఓ సందర్భంలో దాసరిని కలిసి ఆయనతో కలిసి తమ కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్లుగా ప్రకటించాడు. అప్పటికి ఈ సినిమాకు కథ కానీ.. దర్శకుడు కానీ.. ఏదీ ఖరారవ్వలేదు. దాసరి నిర్మాణంలో పవన్ సినిమా మాత్రం పక్కా అన్నారు. గత ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున దాసరి సంస్థ తారక ప్రభు ఫిలిమ్స్ ఈ సినిమా గురించి పత్రికా ప్రకటన కూడా ఇచ్చింది. మధ్యలో కొన్ని కథలపై చర్చలు నడిచినా సినిమా మాత్రం పట్టాలెక్కలేదు. ఇంతలోనే దాసరి అనారోగ్యం పాలయ్యారు. తనువు చాలించారు. దీంతో పవన్-దాసరి కాంబినేషన్ కలగానే మిగిలిపోయింది. మరి దాసరి మరణానంతరమైనా ఆయన బేనర్లో పవన్ సినిమా చేసి ఆయన ట్రిబ్యూట్ ఇస్తాడేమో చూడాలి.
పవన్ సినిమా సంగతలా ఉంచితే.. దాసరి స్వయంగా ఓ భారీ ప్రాజెక్టును తీర్చిదిద్దాలనుకున్నారు. అదే.. మహాభారతం. ఇది ఆయన కలల సినిమా. దీని మీద కొన్నేళ్లుగా ఆయన వర్క్ చేస్తున్నారు కూడా. గత ఏడాది ఓ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ.. స్క్రిప్టు రెడీ అవుతోందని.. మూణ్నాలుగు భాగాలుగా మహాభారతాన్ని తెరకెక్కిస్తానని అన్నారు. కానీ అది కూడా ముందుకు కదల్లేదు. మరోవైపు తన కొడుకు అరుణ్ కుమార్ ను హీరోగా నిలబెట్టేందుకు సన్ అనే ఓ సినిమా తీయాలని.. జయలలిత జీవితం మీద అమ్మ అనే సినిమా చేయాలని కూడా దాసరి ఆశపడ్డారు.