స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు.. ?లోఫర్? డిస్ట్రిబ్యూటర్లకు మధ్య నడుస్తున్న గొడవ రోజుకో మలుపు తిరుగుతోంది. ముందు తన మీద డిస్ట్రిబ్యూటర్లు దాడి చేసినట్లు పూరి కేసులు పెడితే.. అసలు దాడి అన్నదే జరక్కుండా పూరి తప్పుడు కేసులు పెట్టాడని.. అతడి మీదే తిరిగి కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు మీడియా ముందుకొచ్చారు సదరు డిస్ట్రిబ్యూటర్లు. మరోవైపు పూరి జగన్నాథ్ అభిమానుల సంఘం కూడా ఈ వ్యవహారంలో వేలు పెట్టింది. పూరి మీద దాడిని ఖండిస్తూ ఆయన అభిమాన సంఘం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూరిపై దాడికి పాల్పడ్డ వాళ్లని తక్షణమే అరెస్ట్ చేసి.. కఠినంగా శిక్షించాలని ఆంధ్ర-తెలంగాణ పూరి జగన్నాథ్ అభిమాన సంఘం అధ్యక్షుడు రవికుమార్ ఫిర్యాదులో కోరాడు. అయినా ఇలాంటి వ్యవహారాల్లో అభిమాన సంఘాల జోక్యమేంటో అర్థం కావడం లేదు.
మరోవైపు పూరి-డిస్ట్రిబ్యూటర్ల గొడవపై ఎట్టకేలకు ?లోఫర్? నిర్మాత సి.కళ్యాణ్ స్పందించాడు. ఈ వివాదాన్ని తాను పరిష్కరిస్తానని ఆయనన్నాడు. ఈ గొడవకు సంబంధించి తాను పూరితో మాట్లాడతానన్నాడు. ఐతే ?లోఫర్? సినిమాకు సంబంధించి డిస్ట్రిబ్యూటర్లకు తాము ఎలాంటి గ్యారెంటీ ఇవ్వలేదని.. కాబట్టి పరిహారం డిమాండ్ చేయడం సమంజసం కాదని.. అలాగే పూరి డిస్ట్రిబ్యూటర్లపై కేసు పెట్టడమూ సరికాదని ఆయన అభిప్రాయపడ్డాడు. లోఫర్ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లందరూ మంచి వ్యక్తిత్వం ఉన్నవారని.. పూరిపై దాడి చేసి.. బెదిరింపులకు పాల్పడే స్వభావం వాళ్లకు లేదని కళ్యాణ్ చెప్పడం విశేషం. నిజానికి ?లోఫర్? నష్టాలకు సంబంధించి గొడవ జరిగితే.. నిర్మాతకు డిస్ట్రిబ్యూటర్లకే జరగాలి. కానీ ఇక్కడ విచిత్రంగా దర్శకుడితో డిస్ట్రిబ్యూటర్లు గొడవ పడుతున్నారు. నిర్మాత వాళ్లు మంచి వాళ్లంటూ సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఇదేం చిత్రమో!