తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ పాపులర్ కామెడీ షో జబర్దస్త్ చిక్కుల్లో పడింది. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ తో పాటు పటాస్ కామెడీ షోలపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు వెళ్లింది. ఈ ఫిర్యాదు చేసింది మామూలు వ్యక్తి కాదు.. సెన్సార్ బోర్డు సభ్యుడైన దివాకర్. ఈ రెండు కామెడీ షోలు కామెడీ పేరుతో శ్రుతి మించుతున్నాయని.. బూతులతో.. డబుల్ మీనింగ్ డైలాగులతో ఈ షోల్లో అసభ్యత బాగా ఎక్కువైందని.. ఈ షోల దర్శకులు.. నిర్మాతలపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ముందు బాలానగర్ పోలీస్ స్టేషన్లో ఈ టీవీ షోలకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన దివాకర్ కు.. అక్కడ ఆశించిన స్పందన రాలేదు. దీనిపై పోలీసులు ఫిర్యాదు తీసుకోవడానికి అంగీకరించలేదు. దీంతో ఆయన మానవ హక్కుల సంఘాన్ని సంప్రదించారు. దివాకర్ ఫిర్యాదుపై తక్షణం స్పందించిన మానవ హక్కుల సంఘం జబర్దస్త్.. పటాస్ షోల ప్రసారం చేసే టీవీ ఛానెల్ కు నోటీసు పంపింది. ఆగస్టు 10 లోపు ఈ నోటీసులకు బదులివ్వాలని.. సరైన వివరణ లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్ ఆర్సీ హెచ్చరించింది.
జబర్దస్త్.. పటాస్ షోలకు ఆదరణ విషయంలో తిరుగులేనప్పటికీ.. వీటిలో హాస్యం పేరుతో బూతుల డోస్ బాగా ఎక్కువైపోయిందన్న విమర్శలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. జనాలు నవ్వుతున్నారు కదా అని.. ఆదరణ ఉంది కదా అని.. రోజు రోజుకూ డబుల్ మీనింగ్ డైలాగులు.. బూతుల డోస్ పెంచేస్తున్నారని.. ఇది సొసైటీపై చాలా ప్రభావం చూపిస్తుందని.. ముఖ్యంగా పిల్లల మాటలు పెడదోవ పట్టే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే హెచ్ ఆర్సీకి ఈ షోలపై ఫిర్యాదు వెళ్లింది