జూనియర్ ఎన్టీఆర్ గత చిత్రం జనతా గ్యారేజ్ సాధించిన భారీ సక్సెస్ లో.. స్పెషల్ సాంగ్ పక్కాలోకల్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. అప్పటివరకూ క్లాసీ టైపు పాత్రలలో కనిపించిన టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కు.. మాస్ గెటప్ వేసి ఊరమాసు ఐటెం సాంగ్ లో చేయించడం బాగా కలిసొచ్చింది. ప్రమోషన్స్ లో కూడా కాజల్ గెటప్ ను స్టిల్స్ ను బాగానే వాడారు.
ఇప్పుడు జై లవ కుశలో కూడా ఓ స్పెషల్ సాంగ్ ఉండాలని భావించాడట ఎన్టీఆర్. బాబీ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దేవిశ్రీ ఇప్పటికే ఓ స్పెషల్ సాంగ్ ను రికార్డ్ కూడా చేసేశాడట. ఈ ఐటెం సూపర్బ్ గా కుదిరిందని తెలుస్తోంది. మాస్ ను ఉర్రూతలూగించే ఈ ఐటెం సాంగ్.. సినిమాకి స్పెషల్ గా మిగిలిపోవాలని భావిస్తున్నారట టీం అంతా. అందుకే ఇప్పుడీ పాటలో ఎవరితో నటింపచేయాలనే అంశంపై తెగ తర్జన భర్జనలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ అయితే.. ఈ పాటలో ఓ బాలీవుడ్ బ్యూటీని చూపించాలని దాదాపుగా ఫిక్స్ అయిపోయాడట. ఇప్పటికే తన వంతు ప్రయత్నాలు కూడా స్టార్ట్ చేసేశాడని అంటున్నారు.