రాణా - కాజల్ క్రేజీ కాంబినేషన్ లో తేజ దర్శకత్వం వహిస్తున్న చిత్రం నేనే రాజు నేనే మంత్రి. తన తొలి చిత్ర దర్శకుడు తేజతో కలిసి కాజల్ పనిచేయడం ఈ సినిమాకున్నఒక ప్రత్యేకత. అంతే కాదండోయ్ - ఈ సినిమాలో కాజల్ ధరించిన నగలకూ ఓ ప్రత్యేకత ఉంది. ఈ మధ్య విడుదలయిన సినిమా ట్రయిలర్ లో కాజల్ నిండుగా నగలతో కనిపించింది. అయితే అందరూ అనుకునేట్లు అవి గిల్టు నగలు కావు. ఈ సినిమాలో వాడిన నగలన్నీ అసలు సిసలు బంగారు నగలే. వాటిని ఓ జ్యూయలరీ సంస్థ స్పాన్సర్ చేసింది.
అయితే సినిమా పూర్తయ్యాక ఆ నగలు తిరిగిచ్చేయాలి. ఆ నగలను పర్యవేక్షించేందుకు ఆ సంస్థ కొంత మంది సిబ్బందిని షూటింగ్ స్పాట్ లో నియమించింది. నిత్యం షూటింగ్ టైమ్ లో నగలు అందించడం మళ్లీ తీసుకుని జాగ్రత్త చేయడం వారి పని అన్నమాట. అంతే కాదండోయ్ షూటింగ్ సమయంలో కాస్త గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేసారట.
అయితే సంస్థ ఇచ్చిన నగలు సరిపోక మరో 25 లక్షలు సెక్యూరిటిగా పెట్టి మరి కొన్ని నగలు తీసుకున్నారట. సినిమా పూర్తయిన తరువాత ఈ నగలు వెనక్కు ఇచ్చి నగదు తీసుకుంటారన్నమాట. సుమారు కోటిన్నర వరకు సినిమా ప్రచార ఖర్చు కూడా ఆ జ్యూయలరీ సంస్థ భరిస్తోందట.
ఇంత ఖర్చు చేయాల్సిన అవసరం ఆ సంస్థకేముంది అంటారా? భల్లాల దేవుడి క్రేజ్ ను కాజల్ ను తమ నగల ప్రచారానికి వాడుకోవడమే వారి ఉద్దేశమట.ఈ సినిమా ఆగస్టులో విడుదల కానుంది.