చందమామ తర్వాత సక్సెస్ చూడని కృష్ణవంశీ గత దశాబ్ద కాలంలో తన స్థాయికి తగ్గ సినిమాలే తీయలేకపోయాడు. నక్షత్రం ఆయన కెరీర్లోనే అత్యంత పేలవమైన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక మళ్లీ ఆయనకు ఇంకో అవకాశం దక్కడం కష్టమే అని భావిస్తుండగా.. ఒక క్రేజీ ప్రాజెక్టుకు ఆయన రంగం సిద్ధం చేస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి.
సవ్యసాచి తో తెలుగులోకి అరంగేట్రం చేస్తున్న ప్రముఖ తమిళ నటుడు మాధవన్.. బాహుబలి తర్వాత తిరుగులేని ఇమేజ్ సంపాదించిన మన దగ్గుబాటి రానాల కాంబినేషన్లో కృష్ణవంశీ సినిమా చేయబోతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ మాధవన్ కు కథ చెప్పి ఒప్పించిన వంశీ.. రానాను కూడా కలవబోతున్నట్లు సమాచారం. కొన్నేళ్లుగా ప్రొడక్షన్ ఆపేసి సైలెంటుగా ఉన్న సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ చిత్రాన్ని నిర్మిస్తాడని అంటున్నారు. ఆయన ఇంతకుముందు వంశీ మంచి ఫాంలో ఉన్న టైంలో అంత:పురం లాంటి స్పెషల్ మూవీని నిర్మించారు. మొత్తంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి వినిపిస్తున్న పేర్లన్నీ ఆసక్తి రేకెత్తించేవే.