ఒక ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. పరిశ్రమలో చాలా మంచి స్నేహితులుగా గుర్తింపు ఉన్న నారా రోహిత్.. శ్రీవిష్ణు బాక్సాఫీస్ వార్ కు రెడీ అయ్యారు. రోహిత్ హీరోగా నటించిన బాలకృష్ణుడు.. శ్రీవిష్ణు కథానాయకుడిగా చేసిన మెంటల్ మదిలో ఒకే రోజు.. శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఈ రోజు ఇంకో అరడజను సినిమాల దాకా రిలీజవుతున్నప్పటికీ ప్రేక్షకుల దృష్టి ప్రధానంగా ఈ రెండు సినిమాల మీదే ఉంది.
మెంటల్ మదిలో ప్రి రిలీజ్ ప్రివ్యూలతో ఇప్పటికే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా హిట్టవడం గ్యారెంటీ అని.. ఇది మరో పెళ్లిచూపులు అవుతుందని అంటున్నారు. ఐతే ప్రివ్యూల మాటేమో కానీ.. అసలు బొమ్మ పడ్డాకే సినిమా సత్తా ఏంటో తెలుస్తుంది. వసూళ్లు ఎలా వస్తాయన్నది కీలకం. పెళ్లిచూపులు నిర్మాత రాజ్ కందుకూరి నిర్మించిన ఈ చిత్రంతో వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయం కానున్నాడు.
ఇక రోహిత్ సినిమా ‘బాలకృష్ణుడు’ టాక్ ఏంటన్నదే తెలియాల్సి ఉంది. ఎప్పడూ కొత్త తరహా కథలే ట్రై చేసిన రోహిత్.. తొలిసారి కమర్షియల్ రూట్లోకి వెళ్లి చేసిన కథ ఇది. కథ రొటీనే అయినా ఇందులోని ఎంటర్టైన్మెంట్ అందరినీ ఆకట్టుకుంటుందని రోహిత్ చెబుతున్నాడు. ఈ చిత్రాన్ని రూపొందించింది కూడా ఒక డెబ్యూ డైరెక్టరే. అతడి పేరు పవన్ మల్లెల. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందన్నది ఆసక్తికరం.
రోహిత్.. శ్రీవిష్ణు కలిసి గతంలో సోలో.. ప్రతినిధి.. అప్పట్లో ఒకడుండేవాడు లాంటి సినిమాలు చేశారు. వీళ్ల స్నేహం సినిమాలకే పరిమితం కాదు. వ్యక్తిగతంగా కూడా చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఇద్దరి మధ్య. ఇండస్ట్రీలో రోహిత్ అత్యంత ఇష్టపడే వ్యక్తి విష్ణు. అతడి కెరీర్ నిలబెట్టడానికి తన సినిమాల్లో అవకాశాలు ఇప్పించాడు. విష్ణును హీరోగా పెట్టి అప్పట్లో ఒకడుండేవాడు సినిమా కూడా ప్రొడ్యూస్ చేశాడు రోహిత్. శ్రీవిష్ణు కూడా రోహిత్ కు కథల ఎంపికలో సాయం చేశాడు. మరి ఇంత అనుబంధం ఉన్న హీరోలు బాక్సాఫీస్ వార్ కు దిగడం ఆశ్చర్యమే. మరి ఇద్దరిలో ఎవరు ఎవరిపై పైచేయి సాధిస్తారో చూడాలి.