జనతా గ్యారేజ్ తో టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. గతేడాది వరుసగా బ్లాక్ బస్టర్స్ కొట్టేసి మంచి జోరు మీదున్నారీయన. ఒప్పంతో సూపర్ హిట్ కొట్టడమే కాదు.. పులి మురుగన్ తో ఇండస్ట్రీ హిట్ కూడా సాధించేశారు.
ప్రస్తుతం ఈయన నటిస్తున్న మూవీ 1971: బెయాండ్ బోర్డర్స్. మేజర్ రవి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో.. కల్నల్ మహదేవన్ పాత్రలో కనిపించనున్నారు మోహన్ లాల్. ఈ చిత్రంలో అల్లు శిరీష్ ఓ ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. 1971 ఇండో పాక్ వార్ ను బేస్ చేసుకుని ఈ చిత్రం తెరకెక్కుతుండగా.. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రివీల్ చేసింది యూనిట్. వెనకాల బాంబు పేలుతుంటే.. ముందు చేతిలో స్టెన్ గన్ పట్టుకున్న మోహన్ లాల్.. సీరియస్ గా ముందుకు చూస్తూ ఉన్న పోస్టర్ ని విడుదల చేశారు.
దేశభక్తి చిత్రాలు తీయడంలో స్పెషలిస్ట్ గా 1971: బెయాండ్ బోర్డర్స్ దర్శకుడు మేజర్ రవికి గుర్తింపు ఉంది. ప్రస్తుతం భారత్ లో యుద్ధాల ఆధారంగా రూపొందే చిత్రాలకు.. ఈయన మిలిటరీ కన్సల్టెంట్. 1971: బెయాండ్ బోర్డర్స్ మూవీలో కల్నల్ మహదేవన్ గాను.. మేజర్ సహదేవన్ గాను మోహన్ లాల్ డ్యుయల్ రోల్ చేస్తుండగా.. లెఫ్టినెంట్ చిన్మయ్ గా అల్లు శిరీష్ నటిస్తున్నాడు