ఇప్పటివరకు పద్మశ్రీ లేదా ఇతర పద్మాల అవార్డులు వచ్చిన వారి సంఖ్యను చూసుకుంటే.. అసలు తెలుగులో చాలామంది కళాకారులకు సరైన గుర్తింపు రాలేదనే అనుకోవాలి. అదే చాలామంది అభిప్రాయం కూడా. ఇక మొన్నటి పద్మ అవార్డుల్లో అసలు ఫిలిం ఫ్రెటర్నిటీకి చెందిన ఎవ్వరికీ అవార్డులు రాకపోవడం అందరినీ విస్మయపరిచింది. ఇదే విషయంపై కాస్త ఘాటుగా స్పందించారు ప్రముఖ మ్యూజిక్ డైరక్టర్ ఆర్.పి.పట్నాయక్.
''అసలు ఆంధ్ర మరియు తెలంగాణ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికంటే పద్మ అవార్డులకు అర్హులైన వారు ఇంకెవ్వరుంటారు. ఇప్పటికే ఆయనకు పద్మశ్రీ అవార్డ్ వచ్చుండాలి. ఇప్పటివరకు ఆయనకు ఇవ్వకపోవడం బాధాకరం. అందరూ కలసి సమిష్టిగా కృషి చేసి ఆయనకు అవార్డు వచ్చేలా కృషి చేయాలి'' అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు ఆర్.పి.
ఒకవేళ ఆయనతో ఏకీభవించేవారు ఎవరైనా ఉంటే.. తన వాయిస్ తో జతకలవాలని కోరుకుంటున్నాడు కూడా. మరి ఎంతమంది ఆయన అభ్యర్ధనను మన్నించి ఆయనతో చేతులు కలిపి.. గొంతు కలిపి.. ఆయనకు పద్మ అవార్డు వచ్చేలా సహకరిస్తారో చూడాలి.