పవన్ కళ్యాణ్ జోరు పెంచినట్టు కనిపిస్తున్నాడు. ఎన్నికలు దగ్గరపడేలోపే తాను అనుకొన్న రెండు మూడు సినిమాలు చేసేయాలని ఫిక్సయిపోయాడు. అందుకే సినిమా తర్వాత మరో సినిమా చేయాలంటే ఒకట్రెండేళ్లయినా గ్యాప్ తీసుకొనే పవన్ ఈసారి నెల రోజుల్లోపే కొత్త సినిమాని పట్టాలెక్కించాలని డిసైడ్ అయ్యాడు. ఈ నెలాఖరులోనే ఎస్.జె.సూర్య దర్శకత్వం వహించనున్న కొత్త సినిమా మొదలు కాబోతోంది. ఆ సినిమా ఎలా ఉంటుందో కూడా బయటపెట్టాడు పవన్.
ఫ్యాక్షనిజంతో కూడుకొన్న ఓ లవ్ స్టోరీతో ఆ సినిమా తెరకెక్కబోతోందని పవన్ స్పష్టం చేశాడు. ఎస్.జె.సూర్య - పవన్ అంటే క్రేజీ కాంబినేషన్. వాళ్లిద్దరూ కలిసి చేసిన ఖుషీ మాత్రమే హిట్టయింది కానీ... ఆ కాంబినేషన్ ని మాత్రం పవన్ అభిమానులు పిచ్చపిచ్చగా ఇష్టపడుతుంటారు. ఖుషీ ఎఫెక్ట్ అలాంటిది. అయితే ఈసారి కొమరం పులి ఫలితం పునరావృతం కాకుండా అతి జాగ్రత్తగా స్క్రిప్ట్ తయారు చేశాడట. ఖుషీ టైప్ లోనే ఓ ట్రెండ్ సెట్టర్ గా మిగిలిపోయేలా ఆ సినిమాని రూపొందించబోతున్నారని తెలిసింది. కథ కూడా ఎస్.జె.సూర్య రాసింది కాదట. వేరొకరు తయారు చేసిన కథని ఎస్.జె.సూర్య అడాప్ట్ చేసుకొని తెరకెక్కించబోతున్నాడట. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆ సినిమా తక్కువ వ్యయంలోనే తెరకెక్కనుందని తెలిసింది. అది కూడా శరత్ మరార్ నిర్మాణంలోనే రూపొందబోతోందని సమాచారం. ఆ తర్వాత నటించనున్న కొత్త సినిమాని కూడా పవన్ త్వరలోనే ప్రకటిస్తాడట. వేదాళం రీమేక్ గురించి చర్చలు జరుగుతున్నా దానిపై ఇంకా ఓ నిర్ణయానికి మాత్రం రాలేదని పవన్ స్పష్టం చేశాడు.