హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యుక్తా(UKTA-యూనైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్) 6వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. శనివారం జరిగే యూక్తా వార్షికోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఈస్ట్ లండన్ లోని ట్రాక్సీ థియేటర్లో ఈ వేడుకలు గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. దాదాపు 2 వేల మంది తెలుగు వారు ఈ వేడుకల్లో పాలు పంచుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం లండన్ చేరుకున్న పవన్ కళ్యాణ్ కు నిర్వాహకులు, అభిమానుల నుండి గ్రాండ్ వెల్ కం లభించింది. భారీ సంఖ్యలో అభిమానులు లండన్ ఎయిర్ పోర్టుకు తరలి వచ్చారు. పదుల సంఖ్యలో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి ఆయన్ను అక్కడి నుండి ర్యాలీగా తీసుకెళ్లారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఇలాంటి వేడుకలకు ముందు నుండీ దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఆయన తొలిసారి ఇలాంటి ఎన్నారై సెలబ్రేషన్స్ లో పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి ఈ నిర్ణయం వెనక ఏదైనా రాజకీయ కారణాలు ఉన్నాయా? అనే సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు యూక్తా సెలబ్రేషన్స్ లో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు? అనేది ఆసక్తికరంగా మారింది