నటుడిగా ప్రకాష్ రాజ్ ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన చేయని పాత్ర లేదు. ఆయన పలికించని భావం లేదు. ఐతే ఇప్పుడు ఆయనలో కొత్త కోణం చూస్తున్నాం. ఇన్నాళ్లూ ప్రకాష్ దర్శకులు చెప్పింది చేశాడు. ఇప్పుడు తనే దర్శకుడిగా మారాడు. తన అభిరుచికి తగ్గట్లు సినిమాలు తీస్తున్నాడు. ఇప్పటిదాకా తీసిన మూడు సినిమాలు ఆయనకు కమర్షియల్ సక్సెస్ ఇవ్వకున్నా వెనుకంజ వేయలేదు. ?మనఊరి రామాయణం? పేరుతో మరో కొత్త ప్రయత్నం చేశాడు. ఐతే తనకేదో అన్నీ తెలుసని దర్శకుడిగా మారలేదని.. నటుడిగా తనకు ఎగ్జైట్మెంట్ తగ్గిపోవడం.. మరికొన్ని కారణాల వల్ల దర్శకుడిగా మారానని ప్రకాష్ రాజ్ చెప్పాడు.
??దర్శకుడిగా మారానంటే నాకేదో అంతా తెలిసిపోయిందని కాదు. నేను 200 మంది దర్శకులతో పని చేశాను. వెయ్యిమందికి పైగా ఆర్టిస్టులతో కలిసి నటించాను. వాళ్లందరి నుంచి ఎంతో కొంత నేర్చుకున్నాను. నటుడిగా నేను కంఫర్ట్ జోన్లోకి వెళ్లిపోతున్నానేమో అనిపించింది. అందరూ మహానటుడు.. గొప్ప నటుడు అనేస్తున్నారు. నటుడిగా నాకు పని లేదు. పరీక్ష లేదు. అందుకే ఏదైనా కొత్తగా చేయాలనిపించింది. నేర్చుకోవాలనిపించింది. మళ్లీ విద్యార్థిలాగా నిలబడాలనిపించింది. నాకు సినిమాను ఒకలాగా చెప్పాలనుంది. వేరే వాళ్లు తీసిన సినిమాలు చూసి.. ?ఏం సినిమాలు తీస్తారండీ? అని కంప్లైంట్ చేసే రకం కాదు నేను. ఏదైనా ఉంటే మనమూ ప్రయత్నం చేయాలి. మనం నటించే సినిమాలు వేరు. అందులో వ్యాపారం ఉంటుంది. అనేక విషయాలు ముడిపడి ఉంటాయి. వాటికి భిన్నంగా నా శైలిలో సినిమా చెప్పాలనిపించింది. బాధ్యతతో సినిమా తీయాలనిపించి మెగా ఫోన్ పట్టాను. నాకు తెలిసింది నేను తీశాను. దర్శకుడయ్యాక నేను చాలా నేర్చుకున్నా. చాలా సమయం దొరుకుతోంది. చాలా చదవగలుగుతున్నా. ఆలోచిస్తున్నా. నాకు ప్రేక్షకులు దర్శకుడిగా సక్సెస్ ఇవ్వకపోయినా సినిమాలు చేస్తూనే ఉంటా?? అని ప్రకాష్ రాజ్ చెప్పాడు.