ఇటీవల కాలంలో ఇటు దర్శకులు ... అటు యువ కథానాయకులు .. కొంతమంది సీనియర్ కథానాయకులు సైతం తమ దూకుడు పెంచారు. సాధ్యమైనంత తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలు చేసే దిశగా అందరూ ముందుకి సాగుతున్నారు. ఈ విధానం వలన ఫ్లాప్ చూపే ప్రభావం తక్కువగా వుంటుంది, చిత్రపరిశ్రమలో అందరికీ పని దొరుకుతుంది. అయితే మొదటినుంచి కూడా ఈ రూట్లోనే వున్న దర్శకుడిగా పూరీ జగన్నాథ్ కనిపిస్తుంటాడు. చాలా తక్కువకాలంలో తాను అనుకున్న కథను తెరకెక్కించగల సమర్థుడాయన. అదే ప్లానింగ్ తో ఆయన నితిన్ తో ఒక సినిమాకి శ్రీకారం చుడుతున్నాడట.
ఒక వైపున 'జ్యోతిలక్ష్మీ'ని ప్రేక్షకుల ముందుకి తీసుకెళ్లే పనులు చూసుకుంటూ, మరో వైపున చిరంజీవి సినిమాకి సంబంధించిన ఏర్పాట్లు చూసుకుంటూ ఈ మధ్యలో నితిన్ సినిమాని పూర్తి చేయడానికి ఆయన సన్నాహాలు మొదలుపెట్టాడని అంటున్నారు. ఆగస్టు చివరి వారానికి ఈ సినిమాని పూర్తి చేసి, సెప్టెంబర్ నుంచి చిరంజీవి సినిమా షూటింగులో బిజీ కానున్నాడనీ, త్వరలోనే నితిన్ సినిమాకి సంబంధించిన పూర్తివివరాలు తెలిసే అవకాశం వుందని చెబుతున్నారు.