పా రంజిత్ దర్శకత్వంలో సూపర్స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి చిత్రం రోజుకో ప్రత్యేకత చాటుకుంటోంది. ఈ నెల 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం ప్యారిస్లోని ప్రముఖ రెక్స్ థియేటర్లో ప్రదర్శితమయ్యే తొలి భారతీయచిత్రంగా రికార్డు సాధించనున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రాన్ని ఒక్క అమెరికాలోనే 400 తెరలపై విడుదల చేసేందుకు సినీగెలాక్సీ సంస్థ ముందుకొచ్చింది. ఇది వరకే తెరి, 24 చిత్రాలను అమెరికాలో విడుదల చేసిన ఈ సంస్థ తాజాగా రజినీ నటించిన కబాలి తెలుగు, తమిళ వెర్షన్లను అమెరికా వ్యాప్తంగా ప్రదర్శించేందుకు అంగీకరించినట్లు ఆ సంస్థ ప్రతినిధి మధు గార్లపాటి వెల్లడించారు.
విడుదలకు ముందే అమెరికాలో కబాలికి అపూర్వ స్పందన వస్తోందన్నారు. సాంజోస్లోని టౌన్ 3 సినిమాస్లో మంగళవారం టిక్కెట్ విక్రయ కేంద్రాలను ఏర్పాటుచేస్తే రెండు గంటల్లోపే అమ్ముడైపోయినట్లు మధు తెలిపారు. ప్రీమియర్ టిక్కెట్ ఒక్కొక్కటి 25 డాలర్లకు విక్రయించామని, అయినా ఇంకా చాలా డిమాండ్ ఉందని వెల్లడించారు.