ట్విట్టర్లో రకరకాల టాపిక్స్ మీద మాట్లాడుతుంటాడు రామ్ గోపాల్ వర్మ. ఐతే గత మూణ్నాలుగేళ్లలో వర్మ అత్యధికంగా ట్వీట్లు చేసింది మాత్రం పవన్ కళ్యాణ్ గురించే. పవర్ స్టార్కు తన కంటే పెద్ద ఫ్యాన్ ఎవ్వరూ లేదని చెప్పుకుంటూ అత్తారింటికి దారేది టైంలో వర్మ చేసిన పాజిటివ్ ట్వీట్లను పవన్ అభిమానులు బాగానే ఆస్వాదించారు. కానీ గత కొంత కాలంగా వర్మ చేస్తున్న కామెంట్లు మాత్రం పవన్ ఫ్యాన్స్కు ఏమాత్రం రుచించట్లేదు. వర్మ కామెంట్లు ఏవైనా హార్డ్ హిట్టింగ్గా ఉంటాయి కాబట్టి ఆయన విమర్శల్ని తట్టుకోలేకపోయారు ఫ్యాన్స్. చివరికి ఆయనకు శవయాత్రలు చేసే పరిస్థితి వచ్చింది.
అయినా వర్మ ఆగితేనా..? సర్దార్ గబ్బర్ సింగ్' విషయంలో పవన్ గాలి ఎంత తీయాలో అంతా తీశాడు. ఆయన చెప్పినవన్నీ చాలా వరకు వాస్తవాలే కానీ.. అవి పవన్ అభిమానులకు రుచించలేదు. దీంతో ఆయన మీద ట్విట్టర్లో పెద్ద దాడే జరిగింది. ఐతే తాను మంచి ఉద్దేశంతో చేసిన ట్వీట్లను అపార్థం చేసుకుంటున్నారని.. ఇకపై తాను పవన్ కళ్యాణ్ గురించి అస్సలు ట్వీట్ చేయబోనని.. మొన్న 'పవన్ ఫ్యాన్స్కు బై బై' అంటూ ఓ ట్వీట్ పెట్టాడు వర్మ.
దీంతో ఇక వర్మ నిజంగానే పవన్ గురించి మాట్లాడడేమో అనుకున్నారంతా. కానీ లేటెస్టుగా మళ్లీ వర్మ పవన్ గురించి ఓ ట్వీట్ చేశాడు. కాకపోతే పవన్ కళ్యాణ్ అనే పేరు మాత్రం వాడలేదు. ఆల్రెడీ 'సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను జంగిల్ బుక్ కొడుతున్న దెబ్బ గురించి ఓసారి ప్రస్తావించిన వర్మ.. తాజాగా ''ఒక స్టార్ పవర్ ను పక్కన పెట్టేసి.. జంగిల్ బుక్ థియేటర్లలో కూర్చుంటున్న అభిమానుల్ని చూస్తుంటే నాకు అసహనం కలుగుతోంది. వాళ్లంతా గర్దార్స్ ఆఫ్ పవర్'' అని ట్వీట్ చేశారు. పవన్ పేరు వాడకపోతేనేం.. ఇది పవన్ గురించి చేసిన ట్వీట్ అని అందరికీ తెలుసు. అంటే ఇకపై వర్మ 'పవన్ కళ్యాణ్' అనే పేరు మాత్రం వాడడు. కానీ పవన్ గురించి ట్వీట్లు మాత్రం ఆపడన్నమాట.