బలుపు, పండగ చేస్కో లాంటి రెండు హిట్ సినిమాల తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని కొంతకాలం గ్యాప్ తీసుకొని తన కొత్త సినిమాను సాయిధరమ్ తేజ్తో చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. వరుస హిట్స్తో స్టార్ హీరోగా ఎదిగిన సాయిధరమ్ తేజ్ సినిమాల స్టైల్లోనే కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ చకచకా పూర్తవుతున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన టీమ్, తాజాగా మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలుపెట్టింది.
సంగీత దర్శకుడు థమన్ ఆధ్వర్యంలో ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ సినిమా కోసం సాయి ధరమ్ తేజ్ కొత్త లుక్లో కనిపించనున్నారట. ఠాగూర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్గా నటించనున్నారు. త్వరలోనే సినిమా సెట్స్పైకి వెళుతుందని దర్శకుడు గోపీచంద్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.