నటుడు సత్యరాజ్ మళ్లీ హీరోగా నటిస్తున్నారు. అంతే కాదు ఆ చిత్రానికి నిర్మాతగా కూడా మారారు. ఈయన కథానాయకుడి పాత్రలకు దూరంగా కథకు ప్రాముఖ్యత కలిగిన పాత్రల్లో నటించడం మొదలెట్టి చాలా కాలమైంది. అలా సత్యరాజ్ పోషించిన కట్టప్ప పాత్ర బాహుబలి చిత్ర సంచలన విజయానికి చాలా కీలకంగా మారింది. ఇటీవల జాక్సన్దురై చిత్రంలో దెయ్యంగా నటించి ఆ చిత్ర విజయానికి కారణంగా నిలిచారు. ఇలా చాలా చిత్రాలకు సత్యరాజ్ నటన పక్కాబలంగా మారింది. చాలా గ్యాప్ తరువాత కథానాయకుడిగా నటిస్తున్నారు. కిడ్నాప్ థ్రిల్లర్ కథాంశంతో ఆయన తన నందాంబాళ్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా కార్తీక్ అనే నవ దర్శకుడిని పరిచయం చేస్తున్నారు. దీని గురించి సత్యరాజ్ తెలుపుతూ దర్శకుడు కార్తీక్ చెప్పిన కథ వినగానే అందులో తాను నటించాలని నిర్ణయించుకున్నానన్నారు.
అంతగా ఆ కథ తనను ఆకట్టుకుందని తెలిపారు. ఇది రెడియోస్టేషన్ నేపథ్యంలో సాగే కథ అని తెలిపారు. తాను ఇందులో రెడియోస్టేషన్ ప్రధాన అధికారిగా నటుస్తున్నానని చెప్పారు. రెడియో జాకీలు, శ్రోతలపై పర్యవేక్షకుడిగా నటించడం తనకు వినూత్న అనుభవంగా పేర్కొన్నారు.ఇంతకు ముందు తాను చేసిన చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రం ఉంటుందని తెలిపారు. రెడియో జాకీలకు కిడ్నాపర్లకు మధ్య సంఘటనలు చాలా ఆసక్తిగా ఉంటాయన్నారు.దర్శకుడు కార్తీక్ కొత్తవాడైనా చాలా క్లారిటీతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని చెప్పారు. దర్శకుడు కార్తీక్ మాట్లాడుతూ సత్యరాజ్ చిత్రాల్లో ఉండే వ్యంగ్యం, వెటకారం, పంచ్ డైలాగ్స్ అన్నీ ఈ చిత్రంలో ఉంటాయని చెప్పారు.చిత్ర షూటింగ్ ప్రారంభమై ఐదురోజులైందని ఆయన వెల్లడించారు.