తెలుగులో వైవిధ్యం ఉన్న కథల్లో నటించాలని ఉత్సాహం చూపే యువనటుల్లో శర్వానంద్ ఒకరు. ఆ మధ్య కెరీర్లో చలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా వంటి వరుస విజయాలతో మంచి ఊపుమీదున్న ఉన్న శర్వానంద్ ఇప్పుడు సినిమాల కథల ఎంపికలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఎక్స్ ప్రెస్ రాజా విడుదల అయి దాదాపు మూడు నెలలు అవుతున్నా మరో సినిమాకు శర్వానంద్ అంగీకరించలేదంటే తను కథ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నాడో చెప్పవచ్చు.
ఆ మధ్య ?రారా క్రిష్ణయ్య? ఫేమ్ పి. మహేష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చిన తరువాత ఆ సినిమా గురించి సమాచారం లేదు. కానీ ఇప్పుడు మాకు అందిన సమాచారం ప్రకారం గత సంవత్సరం విడుదలైన కుమారి 21F సినిమాతో మంచి విజయం సాధించిన పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో సినిమా చేయడానికి శర్వానంద్ అంగీకరించినట్టు తెలిసింది. సూర్య ప్రతాప్ చెప్పిన లైన్ బావుండటం తో పూర్తి స్క్రిప్ట్ ని డెవలప్ చేయమని శర్వానంద్ కోరడంతో సూర్య ప్రతాప్ ప్రస్తుతం ఆ దిశగా పని చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ లోకి వెళుతుందని తెలిసింది. అయితే ఈ సినిమాని ఎవరు నిర్మిస్తారు? హీరోయిన్ ఎవరు? అన్న విషయాలపై ఎటువంటి సమాచారం లేదు.