కుమారి 21 ఎఫ్ తో నిర్మాతగా అదిరిపోయే అరంగేట్రం చేశాడు స్టార్ డైరెక్టర్ సుకుమార్. ఇప్పుడు ఆయన నిర్మాణంలో రాబోతున్న కొత్త సినిమా దర్శకుడు. సుకుమార్ అన్న కొడుకు అశోక్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ఇది. కుమారి 21 ఎఫ్ టీజర్ ను జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్టయింది. దర్శకుడు కు కూడా ఎన్టీఆర్ సెంటిమెంటు కొనసాగించబోతున్నాడు సుక్కు. ఈ చిత్ర టీజర్ ను ఈ నెల 22న ఎన్టీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించబోతున్నట్లు సమాచారం.
సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన హరి ప్రసాద్ జక్కా దర్శకుడు చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. దర్శకుడు కావాలనుకునే కుర్రాడు.. అతడిని ప్రేమించే అమ్మాయి మధ్య సాగే కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. కుమారి 21 ఎఫ్ కు తనే స్క్రిప్టు అందించిన సుకుమార్.. ఈ సినిమాకు మాత్రం కేవలం నిర్మాణానికే పరిమితమయ్యాడు. కుమారి 21 ఎఫ్ కు తమ పనితనంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన దేవిశ్రీ ప్రసాద్.. రత్నవేలు కూడా ఈ సినిమాకు పని చేయట్లేదు
మరో ముగ్గురు నిర్మాతలు సుక్కుతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంతకుముందు ఆ తరువాత ఫేమ్ ఈషా.. పూజిత అనే మరో అమ్మాయి ఇందులో కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ప్రవీణ్ అనుమోలు.. సంగీతం సాయికార్తీక్ అందిస్తున్నారు. దర్శకుడు చిత్రీకరణ పూర్తయింది.