టాలీవుడ్లో ఇప్పుడు తమన్నా గాలి వీస్తోంది. నిన్నమొన్నటి వరకూ బాలీవుడ్ అంటూ ముంబాయిలో .. కోలీవుడ్ అంటూ చెన్నైలో చక్కెర్లు కొట్టిన తమన్నా, తిరిగి తెలుగులో తీరిక లేనంతగా సినిమాలు అంగీకరిస్తోంది. తాజాగా నాగచైతన్య జోడీగా ఈ అమ్మడిని మరోమారు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. నాగచైతన్య కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో కథానాయికగా ముందుగా సమంతా పేరును పరిశీలించారు. ఆమెతో 'మనం' సినిమా చేసి ఎక్కువకాలం కాకపోవడం వలన, మరో కథానాయికను గురించిన ఆలోచన చేశారట.
హండ్రెడ్ పెర్సెంట్ లవ్ .. తడాఖా వంటి చిత్రాల్లో తమన్నాతో కట్టిన జోడీకి ఎక్కువ మార్కులు పడటం .. ఆ సినిమాలు చేసి ఎక్కువ కాలమే అవుతుండటంతో ఆమెను సెలెక్ట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. బాహుబలి సినిమా తరువాత బెంగాల్ టైగర్ .. నాగార్జున - కార్తి మల్టీ స్టారర్ మూవీని అంగీకరించిన తమన్నా, ఇక నాగచైతన్య సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టే కనిపిస్తోంది. కొత్తకథా నాయికలు పొలోమంటూ వచ్చేస్తున్నా, అమ్మడికి ఈ స్థాయిలో సినిమాలు పడటం నిజంగా విశేషమేనని చెప్పాలి.