చియాన్ విక్రం ఇప్పటివరకూ రకరకాల కేరక్టర్లు వేశాడు. విక్రం మూవీ విడుదలైన ప్రతీ ఏటా నేషనల్ అవార్డ్ రేస్ లో ఉంటాడంటే.. ఏ రేంజ్ వైవిధ్యం ప్రదర్శిస్తాడో అర్ధమవుతుంది. ఇప్పుడు ఇలాంటిదే మరో సినిమాలో నటిస్తున్నాడు చియాన్ విక్రమ్. ఈ మూవీ పేరు ఇరుముగన్ అని గతంలోనే ప్రకటించారు.
విక్రం ఇన్ని రకాల కేరక్టర్లు వేసినా.. తొలిసారిగా ఇరుముగన్ డ్యుయల్ రోల్ చేస్తున్నాడు. ఈ మూవీలో నయనతార - నిత్యామీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇరుముగన్ లో విక్రం చేస్తున్న రెండు కేరక్టర్లలో ఒకటి.. ఇప్పటివరకూ తన కెరీర్ లోనే అత్యంత కష్టమైనది అంటున్నాడు. దీనికి కారణం.. ఇది ట్రాన్స్ జెండర్ పాత్ర కావడమే. హిజ్రా రోల్ లో తొలిసారిగా కనిపించనున్నాడు విక్రం. ఇరుముగన్ ద్వారా తన అభిమానులను తప్పనిసరిగా ఆకట్టుకుంటానని చెబుతున్నాడు విక్రం. ఈ హీరో నటించిన గత కొన్ని చిత్రాలు తీవ్ర నిరాశకు గురిచేశాయి.
అందుకే ఇరుముగన్ విషయంలో ఎలాంటి ఛాన్స్ తీసుకోవడంలేదని చెప్పాడీ కోలీవుడ్ హీరో. ఇరుముగన్ లో నటిస్తున్న విక్రమ్ - నయనతార - నిత్యా మీనన్ లకు టాలీవుడ్ లోనూ ఫుల్లు క్రేజ్ ఉండడంతో.. ఈ చిత్రాన్ని తెలుగు - తమిళ్ లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే తెలుగు వెర్షన్ పై మాత్రం ఇప్పటివరకూ అధికారిక ప్రకటన చేయలేదు చిత్ర యూనిట్.