ఒక పంచ్ డైలాగ్ ఒకసారి వేస్తే బాగుంటుంది. కానీ దాన్ని రెండోసారి కూడా వాడితే పంచ్ అనిపించుకోదు. అల్లు అరవింద్ లాంటి వ్యక్తికి ఈ సంగతి తెలియంది కాదు కానీ.. ఆయనేదో ఓ మిషన్ మీద వెళ్తున్నట్లుగా ఉంది వ్యవహారం చూస్తుంటే. ఇంతకీ మేటర్ ఏంటంటే.. విశాఖపట్నంలో జరిగిన ?సరైనోడు? ఆడియో వేడుకలో చిరంజీవి గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ.. కారు వేసినోడి కంటే రోడ్డేసినోడు గొప్పోడు అంటూ.. చిరంజీవి తమ కోసం తారు రోడ్డు వేశాడని.. తామంతా దాని మీద కారు నడుపుతున్నామని అన్న సంగతి తెలిసిందే. ఈ మాటలకు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. బన్నీకి చిరు మీద ఉన్న గౌరవం చూసి శభాష్ అన్నారందరూ. ఆ వేడుకలో అల్లు అరవింద్ సైతం చిరును ఆకాశానికి ఎత్తేశాడు. తమందరికీ చిరు ఫ్లాట్ ఫామ్ వేశాడని అన్నారు.
ఐతే లేటెస్టుగా ?సుప్రీమ్? ఆడియో వేడుకకు వచ్చిన అరవింద్.. మళ్లీ చిరు ప్రస్తావన తెచ్చాడు. తమ ఫ్యామిలీ కోసం చిరు తారు రోడ్డు వేశాడంటూ నాటి బన్నీ డైలాగ్ ను గుర్తుకు తెచ్చాడు. ఆ రోజు బన్నీ ఆ మాట అంటే బాగా అనిపించింది కానీ.. అల్లు సార్ దాన్నే రిపీట్ చేసేసరికి కొంచెం కామెడీగా అనిపించింది జనాలకు. ఐతే మెగా ఫ్యామిలీ నుంచి బన్నీ అండ్ కో వేరు కుంపటి పెట్టుకుంటున్నారని కొన్నిరోజుల నుంచి గట్టి ప్రచారం జరుగుతూ వస్తున్న నేపథ్యంలో ఆ ప్రచారాన్ని ఖండించి.. తామందరం చిరు వెనకే ఉన్నామని గట్టి సందేశం వినిపించడమే కాక.. పవన్ కూడా చిరు కంటే గొప్పోడు కాడని.. అతను కూడా చిరు వల్లే ఈ స్థాయిలో ఉన్నాడని నొక్కి వక్కాణించడం అరవింద్ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఐతే ఒకసారి గట్టి సందేశం వినిపించాక మళ్లీ.. ప్రతిచోటా అదే మాటలు చెప్పాల్సిన అవసరం లేదు కదా.