ప్రేమమ్ సినిమా తర్వాత అక్కినేని నాగచైతన్యకు క్రేజ్ బాగా పెరిగింది. అతడి కోసం చాలా ప్రాజెక్టులు లైన్లోకి వచ్చాయి. దాదాపు అరడజను మంది డైరెక్టర్లు అతడితో సినిమా చేయడానికి ఆసక్తి చూపించారు. ఐతే చైతూ ముందుగా సోగ్గాడే చిన్నినాయనా ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా మొదలుపెట్టాడు. ఈ మధ్యే కొత్త దర్శకుడు కృష్ణతోనూ సినిమాకు శ్రీకారం చుట్టాడు. దీని తర్వాత చైతూ ఓ తమిళ దర్శకుడితో పని చేయబోతుండటం విశేషం. అది మల్టీలాంగ్వేజ్ ఫిల్మ్ అని తెలుస్తోంది. ఈ మధ్య తమిళంలో ధృవంగల్ పదినారు పేరుతో ఒక థ్రిల్లర్ మూవీ సెన్సేషనల్ హిట్టయింది. ఆ చిత్రాన్ని 16 పేరుతో తెలుగులోకి కూడా అనువాదం చేస్తున్నారు.
గోవిందుడు అందరివాడేలే సినిమాలో రామ్ చరణ్ తండ్రి పాత్ర పోషించిన రెహమాన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇది. ఈ చిత్రంతో కార్తీక్ నరేన్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే గొప్ప ప్రశంసలందుకున్న కార్తీక్ నరేన్.. అప్పుడే తన రెండో సినిమా కూడా మొదలుపెట్టేశాడు. అరవింద్ స్వామి అందులో కీలక పాత్ర చేస్తున్నాడు. ఈ సినిమా కోసం తెలుగు.. మలయాళం నుంచి కూడా ఇద్దరు స్టార్ హీరోల్ని తీసుకోవాలని నరేన్ నిర్ణయించుకున్నాడు. తెలుగు నుంచి ఆ అవకాశం నాగచైతన్యకే ఇచ్చాడు. ధృవంగల్ పదినారు సినిమా చూసి ఫిదా అయిపోయిన చైతూ.. మరో ఆలోచన లేకుండా ఈ సినిమాను ఓకే చేసినట్లు సమాచారం. ఈ చిత్రం తమిళం.. తెలుగు.. మలయాళం మూడు భాషల్లోనూ రిలీజయ్యే అవకాశముంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుస్తాయి.