Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Dec-2017 10:41:50
facebook Twitter Googleplus
Photo

రెండు తెలుగు రాష్ట్రాల్లో జబర్దస్త్ షో పై తీవ్ర స్థాయిలో దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఆ షోలో కామెడీ అసభ్యకరంగా ఉంటోందని పలు మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం జబర్దస్త్ షోలోని ఓ స్కిట్ లో అనాథ పిల్లలను హైపర్ ఆది అవమానించాడని అతడిపై - షోపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రస్తుత టీవీ షోలు - సినిమాలలో హాస్యంపై స్పందించారు. ప్రస్తుతం టీవీ షోలు - సినిమాలలో గతంలో మాదిరిగా సంసారపక్షమైన కామెడీ చేయడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఓ టీవీలోని కామెడీ షో గురించి కొందరు ప్రస్తావించిన సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తతం కామెడీ శ్రుతిమించి రాగాన పడుతోందని రాజేంద్రప్రసాద్ ఆవేదన వ్యక్తంచేశారు. తాను జంధ్యాల - బాపు - రేలంగి వంటి పెద్ద దర్శకుల చిత్రాలలో హాస్య కథానాయకుడిగా నటించానని ఎంతో ఆరోగ్యకరమైన హాస్యాన్ని పండించానని అన్నారు. అప్పటి సినిమాలను ఇప్పటికీ కుటుంబ సమేతంగా ఆదరిస్తున్నారని అందులో సంసారపక్షమైన హాస్యం ఉందని అన్నారు. ప్రస్తుతం టీవీ షోలు సినిమాలలోని హాస్యం గురించి తనను నిలదీస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మెటీరియల్ అయిపోయిన వారే ఈ తరహా కామెడీ చేస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉందని చెప్పారు. ప్రస్తుతం దారి మళ్లిన హాస్యం గురించి అందరూ ఆలోచించాలన్నారు. ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చూసే కామెడినీ తాను నమ్ముతానని అన్నారు.

,  ,  ,  ,  ,