ఈ దసరా సందర్భంగా మరోసారి వెండితెర మీద పండుగ వాతావరణం కనిపించనుంది. గతంలో స్టార్ ఇమేజ్ ఉన్న హీరోల సినిమాలు ఒకే సమయంలో రిలీజ్ చేయడానికి పెద్దగా ఆసక్తిచూపించేవారు కాదు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఒకేసారి రెండు మూడు సినిమాలను భారీగా రిలీజ్ చేయడానికి సరిపోతుండటంతో ఒకే సీజన్లో స్టార్ హీరోలు బరిలో దిగుతున్నారు.
ఈ దసరా సందర్భంగా తెలుగు వెండితెర మీద ముగ్గురు రాముళ్లు సందడి చేయనున్నారు. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ధృవ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు చిత్రయూనిట్. ఇక అదే సమయంలో పూరి జగన్నాథ్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో వస్తున్న ఇజం సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ పోటిలోకి మరో రాముడు కూడా ఎంట్రీ ఇచ్చాడు.
నేను శైలజ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రామ్, ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను కూడా దసరా సీజన్ లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. మరి ఒకేసారి ముగ్గురు రాముళ్లు బరిలో దిగటం ఎవరికి కలిసొస్తుందో చూడాలి.